Total Pageviews

Monday, May 4, 2015

ధరణినెందరెన్ని తపములు చేసినాను - హరికృప గలవాడే అన్నిటా బూజ్యుడు [Dharanendarenni tapamulu chesinanu][

//ప// ధరణినెందరెన్ని - తపములు చేసినాను
హరికృప గలవాడే - అన్నిటా బూజ్యుడు

//చ// మితిలేని విత్తులెన్ని - మేదినిపై జల్లినాను
తతితో విత్తినవే - తగ బండును
ఇతర కాంతలు మరి - యెందరు గలిగాను
పతి మన్నించినదే - పట్టపు దేవులు

// పాలుపడి నరులెన్ని - పాట్లుబడి కొలిచినా
నేలిక చేపట్టిన వాడే - యెక్కుడు బంటు
మూలనెంత ధనమున్నా - ముంచి దాన ధర్మములు
తాలిమితో నిచ్చినదే - దాపురమై నిలుచును

// ఎన్నికకు గొడుకులు - యెందరు గలిగినాను
ఇన్నిటా ధర్మపరుడే - యీడేరును
ఉన్నతి జదువులెన్ని - వుండినా శ్రీవేంకటేశు
సన్నుతించిన మంత్రమే - సతమై ఫలించును

ముఖ్యపదాల అర్ధం:
ధరణి: భూమి
మితిలేని: లెక్ఖలేని
విత్తులు: విత్తనాలు 
మేదిని: భూమిపై 
తతితో: సమయానుకూలంగా
పట్టపు దేవులు: పట్టపు దేవి
పాలుపడి: పాలేరుగా ఉండి
యేలిక: రాజు
యెక్కుడు: ఆధిక్యము, విశేషమైన వాడు
తాలిమితో: ధైర్యంతో, శ్రద్ధతో, దయతలచి 
దాపురమై: (దాపురించు)ప్రాప్తి 
ఎన్నికకు: లెక్కించడానికి
ఈడేరును: నెరవేర్చును
ఉన్నతి జదువులు: గొప్ప చదువులు 
సతమై: శాశ్వతమై 

భావం: 
భూమి మీద ఎవరు ఎన్ని తపస్సులు చేసినా శ్రీహరి కృప కలిగినవాడే అందరిచేతా, అన్నిలోకాల్లోనూ పూజింపబడతాడు.

కాలాన్ని అనుసరించి విత్తనాలు భూమిలో నాటకుండా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎన్ని విత్తనాలు నాటినా లాభమేముంది. కాలాన్ననుసరించి నాటిన విత్తనమే మొలకెత్తి, మంచి పంటను ఇస్తుంది. 
చేరదీసిన స్త్రీలు ఎంతమంది ఉన్నా ఉపయోగం ఏముంది? యే స్త్రీని ఐతే భర్త ఎక్కువగా చేరదీస్తాడో, ఆమే పట్టపురాణి అవుతుంది.  

ఎన్నో ప్రయాసలు పడి పాలేర్లుగా ఎంతమంది మనుష్యులు ఉంటే లాభమేముంది? కానీ, మహారాజు నమ్మినవాడే ముఖ్యమైన వాడు అవుతాడు. 
మూల ఉన్న గదుల్లో ఎంత ధనముంటే మాత్రం ఉపయోగం ఏముంది? శ్రద్ధగా దాన, ధర్మాదులు చేస్తేనే ఆ పుణ్యం జన్మాంతరాల్లో సహాయపడుతుంది. 

ఓ తండ్రికి లెక్కించడానికి ఎంతమంది కొడుకులుంటే మాత్రం ఉపయోగమేముంటుంది? ధర్మప్రవర్తన కలిగిన కొడుకు వల్లే తండ్రికి ఉత్తమగతులు కలిగి, ఆశ తీరుతుంది. 
ఎన్ని గొప్ప చదువులు చదువుకుంటే మాత్రం ఉపయోగం ఏముంది? శ్రీవేంకటేశ్వరుని మంత్రము ఒక్కటే శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తుంది.